ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

గాడిద గుట్టు రట్టు అయింది | నీతి కథలు | Moral Stories in Telugu

పూర్వం ముత్తు పల్లి అనే గ్రామంలో శీనయ్య అనే రజకుడు ఉండేవాడు. రజకుడు అంటే చాకలి అని అర్థం. ఊళ్ళో అందరి బట్టలు ఊరి చివర ఉండే పంటకాలువ ఒడ్డున ఉతికి, కాలువ గట్టున ఆరేసేవాడు ఆ శీనయ్య. ఉదయం గంజితాగి, తన గాడిద మీద మురికి గుడ్డల మూటలు పెట్టి, గాడిదను తొలుకుంటూ కాలువ గట్టుకి వెళ్ళటం, ఆ తర్వాత ఆ మురికి గుడ్డల్ని సున్నం, సబ్బు ఉపయోగించి కాలువలో శుభ్రంగా ఉతికి ఆరేసి, సాయంత్రం కాగానే ఆ బట్టలు చక్కగా మడతలు పెట్టి, మూట కట్టి మళ్ళీ గాడిదపై వేసి ఊళ్ళోకి వెళ్ళి ఉదయం బట్టలు వేసిన వాళ్ళకి ఉతికిన బట్టలు ఇచ్చి, మెల్లగా ఇంటికి చేరేవాడు.

అయితే ఈ శీనయ్య పరమ పీనాశివాడు. తాను బాగా మూడు పుటలా తినేవాడు. పాపం బండచాకిరి చేసే అతని గాడిదకు సరిగా గడ్డి వేసేవాడు కాదు. ఇలా పాపం గాడిద చాలీచాలని ఆహారంతో గాడిద చాకిరీ చేస్తూ కాలం వెళ్ళదీస్తుంది.

ఒకరోజు శీనయ్య దగ్గరలో ఉన్న నగరం అనే పట్టణంలో సంత జరుగుతుండటంతో సరుకులు కొందామని గాడిదను తీసుకొని బయలుదేరాడు.

చాకలి శీనయ్యతో పాటు మంగలి జగ్గయ్య, గ్రామ పురోహితుడు శర్మ, ఇతర వ్యాపారులు సంతకి బయలు దేరారు. సంత అంటే ఏమిటో తెలుసా?

పూర్వకాలంలో ఇప్పటిలాగా కిరాణా దుకాణాలు, షాపింగ్ హల్స్ లేవు కదా, అందుచేత ఎక్కడైనా ఒక పట్టణంలో చిన్న, చిన్న కొట్లు, మార్కెట్లు వారానికి ఒకసారి పెట్టేవారు. వాటినే సంతలు అంటారు. ఈ సంత జరిగిన రోజున చుట్టు ప్రక్కల గ్రామాల ప్రజలు సంత జరిగే ప్రాంతానికి వెళ్ళి తమకు కావాల్సిన సరుకులు కొనుగొలు చేస్తూ ఉండేవారు.

ఇదిగో ఆ రోజునా ఇలాంటి సంతే నగరంలో జరుగుతుందన్నమాట. ఇక ముత్తు పల్లికి నగరానికి మధ్య దూరం పదిమైళ్ళు. పైగా ఈ పదిమైళ్ళు అడవి కుండా వెళ్ళాలి.

ఆ రోజుల్లో బస్సులు, రైళ్ళు లేవు. కనీసం సైకిళ్ళు కూడా లేవు. కనుక ఆనాటి ప్రజలు ఎడ్లు, గుర్రాలు కట్టిన బళ్ళలో వెళ్ళేవారు. సామాన్యులు కాలినడకన ఇంకో చోట నుండి వెళ్ళేవారు.

సరే శీనయ్య అతని బృందం సరదాగా కబుర్లు చెప్పుకుంటూ ఒక గంటలో నగరానికి నడిచి చేరుకున్నారు. సంత మంచి కోలాహలంగా ఉన్నది. శీనయ్య కూడా కావాల్సినవి కొనుక్కొని మళ్ళీ బయలుదేరాడు. అప్పటికి సాయంత్రం ఆరు అయింది. అది చలికాలం, పైగా పౌర్ణమి రోజులు కావటాన ఒక్కడే అయినా ధైర్యంగా తన గ్రామానికి బయలుదేరాడు శీనయ్య.

ఉదయం అతనితో బాటు వచ్చిన వాళ్ళు, ఏదో పని ఉండి, ఆ రాత్రికి నగరంలోనే ఉండిపోయారు. మరి శీనయ్య కూడా ఉండిపోతే రేపు ప్రొద్దున ఊళ్ళో జనాల మురికి బట్టలు ఎవరు ఉతుకుతారు. కనుక శీనయ్య ఏమీ సంకోచించకుండా సంతలో కొన్న సరుకులు గాడిదపై వేసి, ఏదో పాట పెద్దగా పాడుకుంటూ ముత్తు పల్లి వైపు నడక సాగించాడు.

సరిగ్గా అడవి మధ్యలోకి వచ్చే సరికి ఎక్కడినుండో పులి గాండ్రింపు వినబడింది. ఆ గర్జన విన్న శీనయ్యకు కాళ్ళు చేతులు బిగుసుకు పోయాయి. భయంతో అతని గాడిద కూడా గుడ్లు మిటకరించి శీనయ్య వెనకాల దాక్కుంది.

కాసేపటికి పులి అరుపు ఇక వినబడలేదు. దాంతో శీనయ్య బిక్కచచ్చి నిల్చున్న గాడిదను తట్టి, మళ్ళీ నడక ప్రారంభించాడు. కొంత దూరం పోయాక ఒక చెట్టు క్రింద ఒక పులి చర్మం పడి ఉన్నది. శీనయ్య ఆ చెట్టు దగ్గరకు వెళ్ళి, ఆ చర్మాన్ని తీసుకొని గాడిదపై వేసి మళ్ళీ నడక ప్రారంభించాడు. రాత్రి 9 గంటలకి శీనయ్య, అతని గాడిద ఇల్లు చేరారు. శీనయ్య భార్య ఇంట్లోంచి బయటికి వచ్చి గాడిద మీదున్న సామానులు తీస్తూ, వాటిలో ఉన్న పులి చర్మాన్ని చూసి భయంతో కెవ్వున అరిచింది. దాంతో శీనయ్య కంగారు పండి, భార్య దగ్గరికి వచ్చి ఒసేయ్, అరిచి చావకు అది పెద్ద పులికాదు. దాని చర్మం అన్నాడు పెద్దగా నవ్వుతూ, దానికి అతని భార్య ఇలా అన్నది. ఛీ, ఆ చచ్చిన పులి చర్మం మనకెందుకు ఆవతల పారేయకుండా, దానికి శీనయ్య ఇలా అన్నాడు. ఏమేయ్ ఆ పులితొలే మన గాడిదకి కావాల్సినంత గడ్డి, గాదం దొరికేలా చేస్తుంది.

అదెలా అన్నది ఆశ్చర్యంగా శీనయ్య భార్య. అదెలాగో చూద్దుగానివి అని, గాడిద దగ్గరగా వెళ్ళి దానికి తన దగ్గరున్న పులి చర్మాన్ని నేర్పుగా కప్పాడు. ఇప్పుడు కాస్త దూరం నుంచి చూస్తే, శీనయ్య గాడిద పులిలా కనిపిస్తుంది.

శీనయ్య గాడిద చెలిలో ఇలా అన్నాడు. ఈ రోజు రాత్రి నుంచీ, ప్రతిరాత్రి ఈ ఊళ్ళొ రైతుల పొలాల మీద పడి నీ ఇష్టం వచ్చినట్టు మెక్కి పారేయ్.

గాడిద ఆనందంగా ఊళ్ళొ రైతులు పొలాలలోకి వేగంగా వెళ్ళి, వరి పైరు కస, కస నమలటం ప్రారంభించింది.

అదే సమయానికి ఆ పొలానికి కాపాలాగా ఉందామని వచ్చిన ఇద్దరు రైతులు పులి చర్మంలో ఉన్న గాడిదను చూసి, పులి అని భ్రమించి పెద్దగా అరిచి గడ, గడలాడుతూ ఊళ్ళొకి పారిపోయారు. క్షణాల్లో ఈ వార్త ఊరంతా గుప్పుమన్నంది. ఏమిటావార్త మన గ్రామ పొలాలలో రాత్రిళ్ళు పులి తిరుగుతుందని. అంతే రాత్రిళ్ళు రైతులు పొలాలకేసి రావటం మానేశారు.

శీనయ్య గాడిద పంట పండింది. రోజు రాత్రి పూట, ఆ ఊరి చేలల్లో కావాల్సినంత గడ్డి, గాదం కడుపార తిని తెల్లారి గట్ల ఇల్లు చేరేది. ఇలా రోజులు గడుస్తున్నాయి. తేరగా దొరికే గడ్డీ, గాదం తిని శీనయ్య గాడిద యమాబలిసి పోయింది. నిజం నిప్పులాంటిది. అది ఎల్లకాలం దాగదు. ఒకరోజు శీనయ్య గాడిద చేలో మేస్తుండగా, ఎక్కడి నుండో ఒక ఆడ గాడిద ఓండ్ర పెట్టసాగింది. ఆ ఓండ్ర విన్న శీనయ్య గాడిద కూడా కులాసాగా ఓండ్ర పెట్టింది. దూరంగా నక్కి చూస్తున్న ఒక రైతు ఇది కనిపెట్టాడు.

ఇన్నాళ్ళు. తమని మోసం చేసి తమ పొలాల లోని పంట మేస్తున్నాది, పులి చర్మం కప్పుకున్న ఒక గాడిద అని తెలిసి, అందర్నీ కేకేసి పిలిచాడు. అందరూ దుడ్డ కర్రలు తీసుకొని శీనయ్య గాడిదని చావ బాదారు. ఆ దెబ్బలు తట్టుకొలేక ఆ గాడిద దగ్గరలో ఉన్న అడవులలోకి పారిపోయింది. ఆ తర్వాత శీనయ్య గాడిద మళ్ళీ ఊళ్ళోకి రాలేదు. 

నీతి : అవతారం చూసి మోసపోరాదు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

స్నేహమేరా జీవితం | నీతి కథలు | Moral Stories in Telugu

పూర్వం చంద్రగిరి అడవుల్లో ఒక జింకల కుటుంబం జీవిస్తూఉండేది. ఆ కుటుంబంలో ఉన్న ఒక పిల్ల జింక మహా తుంటరిది. అది అనేక రకాలుగా దాని తల్లి, దండ్రుల్ని ఆడించి, విసిగించేది. ఒక్కొసారి అర్ధరాత్రులు తన మందని వదిలి దూరంగా వెళ్ళి గడ్డి మేసేది.  ఒకసారి ఆ జింక పిల్ల అలాగే మంద నుండి విడిపోయి, దూరంగా తిరగ సాగింది. అలా తిరుగుతూ తిరుగుతూ ఆ జింక పిల్ల ఒక వేటగాడు పన్నిన వలలో చిక్కిపోయింది. ఆ వేటగాడు ఆ జింకను తీసుకెళ్ళి యువరాణికి జన్మదిన కానుకగా ఇచ్చాడు. ఆ అందమైన జింక పిల్లను చూసిన యువరాణి ఆనందంతో ఎన్నో విలువైన ఆభరణాలు, వస్త్రాలు వేటగాడికి బహుమతిగా ఇచ్చింది. అంత విలువైన బహుమానాలు అందుకున్నా వేటగాడు ఆనందంగా తన ఇంటికి తిరిగి వెళ్ళాడు. యువరాణి ఆ జింకను ఎంతో ప్రేమగా చూసుకున్నది. దానికి ఎన్నో రకాల ఆహారాలు పెట్టేది. ఎన్ని చేసినా, ఆ జింకకు ఆనందం కలుగలేదు. కారణం స్వేచ్ఛ జీవిగా ఆనాటి దాకా బ్రతికిన జింక యువరాణి గృహంలో నిర్భంధించ బడింది. అలా దిగులు పడి, ఆ జింక పిల్ల నిద్ర ఆహారాలు మనేసి, దిగులుగా - పడుకునేది. ఇది చూసిన యువ రాణి ఎంతో బాధ పడి జింకకు స్వేచ్ఛ కల్గించాలని నిశ్చయించుకొని, భటుల్ని పిలిచి ఆ జింకను అడవిలో వ...

దుష్టుడికి చేసిన మేలు | నీతి కథలు | Moral Stories in Telugu

పూర్వం 'వేండ్ర' అనే గ్రామంలో పిచ్చయ్య శాస్త్రి అనే పేద బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడికి నలుగురు ఆడ పిల్లలు జన్మించారు. అతని భార్య సుశీల. చాలా ఓర్పు గల స్త్రీ. ఆమె ఎంత పేదరికం అనుభవిస్తున్నా భర్తను, పిల్లల్ని ఆపేక్షగా చూస్తుండేది. అధిక సంతానం పైగా సరిఅయిన సంపాదనా లేని శాస్త్రికి ఆర్థిక సమస్యలు అధికం కాసాగాయి. శాస్త్రి కుటుంబం కనీసం ఒక్క పూటైనా కడుపు నిండా తిండి తినలేని దౌర్భాగ్య స్థితికి చేరింది. పైగా శాస్త్రి కూతుళ్ళలో మొదటి ఇద్దరు ఆడ పిల్లలు పెళ్ళిడుకు వచ్చేసారు. ఇక శాస్త్రి భార్య సుశీల ఈ దరిద్రాన్ని, అసహాయతను సహించలేకపోయింది. దాంతో భర్తను, పిల్లలు దూరంగా దొడ్లో చెట్టకు పాదులు తీస్తున్న సమయంలో కలిసి ఇలా అన్నది. “ఏమండీ చూస్తున్నారు కదా, మన కుటుంబ దుస్థితి. తినటానికి తిండిలేదు. కట్టుకొవటానికి సరైన బట్టలులేవు. పైగా పైవాళ్ళు ఇద్దరూ పెళ్ళికి సిద్ధం అయ్యారు. మీరు వేరే ప్రాంతానికి వెళ్ళి, ఏదైనా ఉద్యోగం చేసి నాలుగు రూపాయలు సంపాదించుకురండి.” భార్య మాటలకు శాస్త్రి 'ఔను' అన్నట్టు తల ఆడించాడు. ఆపై ఏమీ ఆలోచించకుండా భార్య, బిడ్డల్ని గ్రామంలో వదిలేసి సంపాదన కోసం కాస్త దూరంలో ఉన్న పట్టణాన...

అసూయకు ఫలితం | నీతి కథలు | Moral Stories in Telugu

మేడపాడు అనే గ్రామంలో పాపయ్య అనే రజకుడు ఉండేవాడు. అతడు ఊళ్ళోని ప్రజల ఇళ్ళలోని మురికి బట్టలు ఉతికి, సాపు చేసి అందించేవాడు. పాపయ్యకి ఒక గాడిద, ఒక కుక్క ఉండేది. గాడిద ఉదయం పూట మురికి బట్టల మూటలు మోసుకొంటూ పాపయ్య వెంట ఊరి చివరున్న పంట కాలవ దాకా వెళ్ళేది. సాయంత్రం కాగానే ఉతికి, మడతలు పెట్టిన బట్టల మూటలు మోసుకుంటూ ఇంటికి వచ్చేది. అయినా దానికి పాపయ్య తగినంత తిండి పెట్టేవాడు కాదు. పైగా అప్పుడప్పుడూ, బుద్ధిలేని గాడిదా! అని తిడుతూ, బెత్తంతో బాదేవాడు. ఇక కుక్క విషయానికి వస్తే, అది చేసే పనిల్లా ఆ ఇంటికి కాపలా కాయటం. రాత్రళ్ళు ఇంటి చుట్టూ తిరుగుతూ దొంగలు రాకుండా చూడటం. పాపయ్య కుక్కని ఎంతో ప్రేమగా చూసేవాడు. దానికి పాలు పోసేవాడు. ఆదివారం నాడు మాంసం కూరపెట్టేవాడు. కుక్కకి యజమాని ఇస్తున్న ఆహారం, గౌరవం చూసి గాడిదకు ఆగ్రహం కల్గది. ఏమిటీ నా ఖర్మ, చచ్చేచాకిరీ, చేసే నాకేమో సరిగ్గా తిండి పెట్టరు, పైగా తిట్లు, దెబ్బలు, కానీ ఊరికే అలా నిల్చుని ఎవరైనా వస్తే మొరిగే కుక్కకు అంత గౌరవం ఏమిటి అని తెగ విచారించేది. చివరికి గాడిదకి ఒక విషయం స్ఫురించింది. అదేమంటే కుక్కకి అంత గౌరవం ప్రాముఖ్యత రావటానికి కారణం దాని ప్రవర్తన...