ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

దుష్టులతో స్నేహం | నీతి కథలు | Moral Stories in Telugu

పూర్వం చంద్రగిరి అడవులలో సంజీవి అనే సింహం ఉండేది. ఆ సింహం పేరుకి క్రూర మృగం అయినా చాలా మంచి గుణాలు కలిగి మంచి పేరు కలిగి ఉండేది. ఒక రకంగా ఆ అడవికి,ఆ సింహం రాజుగానే భావించవచ్చు. ఆ సింహానికి ఒక కాకి, ఒక నక్క ఒక తొడేలు మంచి స్నేహితులుగా ఉండేవి.

రోజూ సాయంకాలం సింహం తన స్నేహితులతో కలిసి అడవిలో షికారు చేస్తూ, బాగా ఆకలైనప్పుడు మాత్రమే ఏదైనా జంతువును వేటాడేది. అలా సింహం చేత చంపబడ్డ జీవాన్ని కాకి, నక్క, తొడేలులతో కలిసి సింహం భుజించేది.

ఒకరోజు సాయంకాలం సింహం దాని మిత్రులు అడవిలో సంచరిస్తుండగా, వాళ్ళకి ఒంటరిగా తిరుగుతున్న ఒక ఒంటె కన్పించింది. అది చూసిన సింహం, నక్కను పిల్చి ఇలా అన్నది. ఓయీ నక్క మిత్రమా! 

అక్కడ ఓ ఒంటె ఒంటరిగా తిరుగుచున్నది. అది బహుశా ఎవరిదో వ్యాపారికి చెందిన ఒంటె కావచ్చు. దొవ తప్పి ఇక్కడ తిరుగుతున్నట్టుగా ఉన్నది. నీవు వెళ్ళి దాన్ని నా వద్దకు పిల్చుకు రా! దాంతో ఆ నక్క ఒంటె దగ్గరికి వెళ్ళి సింహం రాజుగారు రమ్మంటున్నారని చెప్పింది.

అప్పుడు ఒంటె సింహం దగ్గరికి వచ్చి నమస్కరించి నిల్చున్నది. అప్పుడు సింహం ఒంటెను కూడా తన మిత్రబృందంలో చేరమని ఆహ్వానించింది.

ఆ అడవిలో దిక్కు, దివానం లేకుండా తిరుగుతున్న తనకి సింహం ఆశ్రయం దొరకటంతో ఒంటె సంతోషంగా సింహం రాజుగారి స్నేహ బృందంలో చేరింది. ఆ తర్వాత సింహం, నక్క, తొడేలు, కాకి, ఒంటె రోజు హాయిగా వన విహారం చేస్తూ, కులాసాగా కబుర్లు చెప్పుకుంటూ ఉండేవి.

ఒకసారి ఆ అడవికి ఒక యువరాజు వేటకి వచ్చాడు. అతడు అనేక జంతువుల్ని వేటాడి, చివరగా సింహం పై ఒక బాణం వేసాడు. ఆ బాణం సింహం నడుం భాగంలో దిగింది. అయిన యువరాజు వేయబోతున్న రెండో బాణానికి అందకుండా పారిపోయి, తన గుహను చేరుకుంది.

ఆ తర్వాత సింహం కోతి వైద్యుడిని పిలిపించింది. కోతి వైద్యుడు అడవిలో ఏ జంతువుకి ఏ రోగం వచ్చినా మంచి వైద్యం అందిస్తూ ఉంటుంది. సరే ఆ కోతి వైద్యుడు సింహం నడుములో దిగబడ్డ బాణాన్ని లాగి, ఏవో పశర్లు పూసి కట్టు కట్టి వెళ్ళిపోయింది.

సింహం స్నేహితులు దిగాలుగా సింహం ప్రక్కనే నిల్చున్నాయి. అలా కొద్ది రోజులు గడిచాయి. సింహానికి గాయం తగ్గింది. కానీ శరీరంలో పూర్వపు శక్తి నశించింది. దాంతో జంతువుల్ని వేటాడే శక్తి కూడా పోయింది. పైగా ఎక్కడలేని నీరసంతో గుహలో నుంచి బయటికి నడిచే శక్తి కూడా లేకుండా పోయింది.

ఎప్పుడైతే సింహం వేటాడటం మానేసిందో కాకి, నక్క, తొడేళ్ళకి ఆహారం లేకుండా పోయింది. దాంతో సింహంతో సహా అవి మూడు ఆకలికి డొక్కలు మాడి బక్కచిక్కాయి. కానీ వాళ్ళ మిత్రుడైన ఒంటె శాఖాహారి అంటే పచ్చి గడ్డి వగైరాలు తింటుంది.

కనుక దానికేమీ ఆహార కొరత రాలేదు. రోజు హాయిగా ఆ అడవిలో గడ్డీ, గాదం కడుపునిండా తిని తెగబలిసిపోసాగింది. ఇలా ఒక వారం గడిచింది.

ఒకరోజు సింహం తన మిత్రుల్ని పిలిచి ఇలా అన్నది. నాకు వేటాడే శక్తి నశించింది.

ప్రస్తుతం కనీసం ఈ గుహను విడిచి బయటికి వెళ్ళే ఓపిక కూడా లేదు. మీరంతా అడవిలోకి వెళ్ళి ఏదైనా జీవాన్ని వేటాడి తీసుకురండి. అందరూ కలిసి భోంచేద్దాం.

సింహం మాటలు విని నక్క, తొడేలు, కాకి, ఒంటె అడవిలోకి వెళ్ళి ఏదైనా జీవి దొరకుతుందేమో అని వెతక సాగాయి. వాటి దురదృష్టం వలన ఏ జంతువు వాటికి దొరకలేదు.

ఇంతలో నక్క బుర్రలో ఓ ఆలోచన వచ్చింది. ఆ దుష్ట నక్క తన స్నేహితులు అయిన కాకి, తొడళ్ళను దగ్గరగా పిలిచి, ఇలా చెప్పింది. ఈ ఒంటె గడ్డీ, ఆకులు తిని తెగ బలిసింది.

దీన్ని కనుక సింహంచేత చంపించం అంటే మనకు నెల రోజులు హాయిగా విందు చేసుకోవచ్చు.

నక్క మాటలు విని తొడేలు, కాకి సంబర పడ్డాయి. దూరంగా నిల్చుని గడ్డి తింటున్న ఒంటెకి తనపై జరుతున్న కుట్ర తెలీక అమాయకంగా చూస్తున్నది. సరే, సరే అంటే అనుకుని నక్క ఒక్కటే సింహం దగ్గరికి వెళ్ళి ఇలా అన్నది.

"ఓ సింహరాజా! ప్రస్తుతం మీరు తిండిలేక ఆకలితో బాధ పడుతున్నారని తెలిసి ఈ అడవిలో అన్ని జంతువులు బాధపడుతున్నాయి. మీ కోసం అవన్నీ ప్రాణత్యాగం చేసి, మీకు ఆహారం అవ్వాలని భావిస్తున్నాయి. మీరు కనుక అంగీకరిస్తే, ముందుగా మన ఒంటె మిత్రుడు మీకు ఆహారం అవుతాడట.”

నక్క మాటలు విని ఆగ్రహించిన సింహం ఓరి కుటిలుడా! ఎంత ఆకలి వేస్తే మాత్రం మనతో ఇన్నాళ్ళుగా ఉన్న ఆ అమాయకపు ఒంటెను ఎలా చంపగలననుకున్నావు.

ఈ ఆకలితో బాధనైనా భరిస్తాను కానీ, నమ్మిన మిత్రుడిని చంపను అన్నది. అప్పుడు నక్క గజ, గజలాడుతూ అయ్యా సింహరాజా! మీరు నన్ను పూర్తిగా అపార్థం చేసుకున్నారు. రాజైన మీరే ఆకలితో మరణిస్తే, ఈ అడవిలోని మిగిలిన జంతువులకి ఎవరు రక్షణ కల్పిస్తారు. అని సింహాన్ని మంచి మాటల్తో ఒంటెను చంపటానికి అంగీకరింపచేసింది.

ఆ తర్వాత ఒంటె దగ్గరికి వెళ్ళి, ఓయి ఒంటె మిత్రమా! మన రాజుగారు ఆకలితో చావటానికి సిద్ధంగా ఉన్నారు. ఆయన స్నేహితులం అయిన మనం మన ప్రాణాలు ఇచ్చి అయినా సరే ఆయన్ని కాపాడుకోవాలి అని నీతి సూక్తులు వల్లించింది.

నక్క చెప్తున్న మాటల్ని విన్న ఒంటె రాజుగారి కోసం చావటానికి సిద్ధపడింది. ఆ తర్వాత ఒంటె, కాకి, నక్క, తోడేలు కలిసి, రాజుగారి దగ్గరికి వెళ్ళి తమని చంపి ఆకలి తీర్చుకోమని అడిగాయి. సింహం ఏం చెయ్యాలో అర్థంకాక అలా చూస్తూ ఉండిపోయింది.

అప్పుడు ఒంటె ముందుకి వచ్చి, ఓ సింహ మిత్రమా ఈ కాకి నక్క, తొడేలు చాలా చిన్న శరీరాన్ని కలిగి ఉన్నాయి. నాది భారీ శరీరం. మీరు నన్ను చంపితే వారం, పది రోజులు మీకు ఆహారం లభిస్తుంది. మీకు ఆహారం అయిన నాకు పుణ్యం వస్తుంది. కనుక ఏమీ ఆలోచించకుండా నన్ను సంహరించండి అన్నది.

ఇక సింహం ఆకలికి ఆగలేక ఒంటె పైకి లంఘించి, తన పంజాతో ఒంటెని ఒక్క దెబ్బతో చంపివేసింది. ఆ తర్వాత నక్క, తొడేలు, కాకి సింహంతో కలిసి ఆ ఒంటె మాంసాన్ని తృప్తిగా భుజించాయి. నక్క పన్నిన కుట్రకు బుద్ధిలేని ఒంటె బలి అయిపోయింది. 

నీతి : దుష్టులతో స్నేహం వల్ల ఎప్పటికైనా ముప్పు తప్పదు. 

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

స్నేహమేరా జీవితం | నీతి కథలు | Moral Stories in Telugu

పూర్వం చంద్రగిరి అడవుల్లో ఒక జింకల కుటుంబం జీవిస్తూఉండేది. ఆ కుటుంబంలో ఉన్న ఒక పిల్ల జింక మహా తుంటరిది. అది అనేక రకాలుగా దాని తల్లి, దండ్రుల్ని ఆడించి, విసిగించేది. ఒక్కొసారి అర్ధరాత్రులు తన మందని వదిలి దూరంగా వెళ్ళి గడ్డి మేసేది.  ఒకసారి ఆ జింక పిల్ల అలాగే మంద నుండి విడిపోయి, దూరంగా తిరగ సాగింది. అలా తిరుగుతూ తిరుగుతూ ఆ జింక పిల్ల ఒక వేటగాడు పన్నిన వలలో చిక్కిపోయింది. ఆ వేటగాడు ఆ జింకను తీసుకెళ్ళి యువరాణికి జన్మదిన కానుకగా ఇచ్చాడు. ఆ అందమైన జింక పిల్లను చూసిన యువరాణి ఆనందంతో ఎన్నో విలువైన ఆభరణాలు, వస్త్రాలు వేటగాడికి బహుమతిగా ఇచ్చింది. అంత విలువైన బహుమానాలు అందుకున్నా వేటగాడు ఆనందంగా తన ఇంటికి తిరిగి వెళ్ళాడు. యువరాణి ఆ జింకను ఎంతో ప్రేమగా చూసుకున్నది. దానికి ఎన్నో రకాల ఆహారాలు పెట్టేది. ఎన్ని చేసినా, ఆ జింకకు ఆనందం కలుగలేదు. కారణం స్వేచ్ఛ జీవిగా ఆనాటి దాకా బ్రతికిన జింక యువరాణి గృహంలో నిర్భంధించ బడింది. అలా దిగులు పడి, ఆ జింక పిల్ల నిద్ర ఆహారాలు మనేసి, దిగులుగా - పడుకునేది. ఇది చూసిన యువ రాణి ఎంతో బాధ పడి జింకకు స్వేచ్ఛ కల్గించాలని నిశ్చయించుకొని, భటుల్ని పిలిచి ఆ జింకను అడవిలో వ...

దుష్టుడికి చేసిన మేలు | నీతి కథలు | Moral Stories in Telugu

పూర్వం 'వేండ్ర' అనే గ్రామంలో పిచ్చయ్య శాస్త్రి అనే పేద బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడికి నలుగురు ఆడ పిల్లలు జన్మించారు. అతని భార్య సుశీల. చాలా ఓర్పు గల స్త్రీ. ఆమె ఎంత పేదరికం అనుభవిస్తున్నా భర్తను, పిల్లల్ని ఆపేక్షగా చూస్తుండేది. అధిక సంతానం పైగా సరిఅయిన సంపాదనా లేని శాస్త్రికి ఆర్థిక సమస్యలు అధికం కాసాగాయి. శాస్త్రి కుటుంబం కనీసం ఒక్క పూటైనా కడుపు నిండా తిండి తినలేని దౌర్భాగ్య స్థితికి చేరింది. పైగా శాస్త్రి కూతుళ్ళలో మొదటి ఇద్దరు ఆడ పిల్లలు పెళ్ళిడుకు వచ్చేసారు. ఇక శాస్త్రి భార్య సుశీల ఈ దరిద్రాన్ని, అసహాయతను సహించలేకపోయింది. దాంతో భర్తను, పిల్లలు దూరంగా దొడ్లో చెట్టకు పాదులు తీస్తున్న సమయంలో కలిసి ఇలా అన్నది. “ఏమండీ చూస్తున్నారు కదా, మన కుటుంబ దుస్థితి. తినటానికి తిండిలేదు. కట్టుకొవటానికి సరైన బట్టలులేవు. పైగా పైవాళ్ళు ఇద్దరూ పెళ్ళికి సిద్ధం అయ్యారు. మీరు వేరే ప్రాంతానికి వెళ్ళి, ఏదైనా ఉద్యోగం చేసి నాలుగు రూపాయలు సంపాదించుకురండి.” భార్య మాటలకు శాస్త్రి 'ఔను' అన్నట్టు తల ఆడించాడు. ఆపై ఏమీ ఆలోచించకుండా భార్య, బిడ్డల్ని గ్రామంలో వదిలేసి సంపాదన కోసం కాస్త దూరంలో ఉన్న పట్టణాన...

అసూయకు ఫలితం | నీతి కథలు | Moral Stories in Telugu

మేడపాడు అనే గ్రామంలో పాపయ్య అనే రజకుడు ఉండేవాడు. అతడు ఊళ్ళోని ప్రజల ఇళ్ళలోని మురికి బట్టలు ఉతికి, సాపు చేసి అందించేవాడు. పాపయ్యకి ఒక గాడిద, ఒక కుక్క ఉండేది. గాడిద ఉదయం పూట మురికి బట్టల మూటలు మోసుకొంటూ పాపయ్య వెంట ఊరి చివరున్న పంట కాలవ దాకా వెళ్ళేది. సాయంత్రం కాగానే ఉతికి, మడతలు పెట్టిన బట్టల మూటలు మోసుకుంటూ ఇంటికి వచ్చేది. అయినా దానికి పాపయ్య తగినంత తిండి పెట్టేవాడు కాదు. పైగా అప్పుడప్పుడూ, బుద్ధిలేని గాడిదా! అని తిడుతూ, బెత్తంతో బాదేవాడు. ఇక కుక్క విషయానికి వస్తే, అది చేసే పనిల్లా ఆ ఇంటికి కాపలా కాయటం. రాత్రళ్ళు ఇంటి చుట్టూ తిరుగుతూ దొంగలు రాకుండా చూడటం. పాపయ్య కుక్కని ఎంతో ప్రేమగా చూసేవాడు. దానికి పాలు పోసేవాడు. ఆదివారం నాడు మాంసం కూరపెట్టేవాడు. కుక్కకి యజమాని ఇస్తున్న ఆహారం, గౌరవం చూసి గాడిదకు ఆగ్రహం కల్గది. ఏమిటీ నా ఖర్మ, చచ్చేచాకిరీ, చేసే నాకేమో సరిగ్గా తిండి పెట్టరు, పైగా తిట్లు, దెబ్బలు, కానీ ఊరికే అలా నిల్చుని ఎవరైనా వస్తే మొరిగే కుక్కకు అంత గౌరవం ఏమిటి అని తెగ విచారించేది. చివరికి గాడిదకి ఒక విషయం స్ఫురించింది. అదేమంటే కుక్కకి అంత గౌరవం ప్రాముఖ్యత రావటానికి కారణం దాని ప్రవర్తన...