ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

అపరిచితుడిని నమ్మరాదు | నీతి కథలు | Moral Stories in Telugu

పూర్వం చంద్రగిరి అడవులలో 'గజేంద్ర' అనే ఏనుగు ఉండేది. ఆ ఏనుగు చాలా పెద్దదిగా, మహాబలంగా ఉండేది. ఆ అడవిలో ఉండే అన్ని జంతువులు ఆ ఏనుగు ఆకారం, బలం చూసి హడలిపోయేవి. చివరికి కూౄరమృగాలైన పులి, సింహాలు కూడా గజేంద్ర దగ్గరకు కూడా వెళ్ళేవికాదు. ఇక ఆ గజరాజు దినచర్య పరమ అరాచకంగా ఉండేది.

ఉదయం సూర్యోదయం కాగానే నిద్రలేచి అలా అడవి మధ్యలో ఉన్న పెద్ద కొలనులో దిగేది. ఆ తర్వాత గంటల కొద్దీ ఆ కొలనులో స్నానం చేయటం, నీళ్ళతో ఆడుకోవటం చేసేది. దాని తొండాన్ని ఆ కొలనులో ముంచి ‘బర్రున' చాలా నీళ్ళు పీల్చి, అన్ని వైపులకీ చిమ్మేది.

ఆ కొలను చుట్టూ ఉన్న చెట్లపై ఆ ఏనుగు అలా . నీళ్ళు చిమ్మేసరికి ఉండే కోతులు, పక్షులపై నీళ్ళు ధారలు పడి ఊపిరి ఆడక గిల, గిలలాడి చెట్ల మీద నుంచి క్రింద పడి చచ్చేవి.

ఆ తర్వాత స్నానం అయినాక, నీళ్ళ నుండి బయటికి వచ్చి తనకు నచ్చిన పెద్ద పెద్ద చెట్లను తొండంతో పెకిలించి లేతగా ఉండే చెట్ల కొమ్మల్ని హాయిగా భోంచేసేది. ఇంకా అడవిలో ఉండే పళ్ళ చెట్లను కూడా తొండంతో విరగ దీసి, ఆ చెట్ల పండ్లను తింటూ ఉండేది.

ఆ ఏనుగు భారీ ఆకారం చూసి అది చేసే నిర్లక్ష్య చర్యల్ని అడ్డగించే సాహసానికి ఆ అడవిలో ఏ జంతువూ దిగలేదు. ఇక అడవికి రాజైన మృగరాజు సింహం కూడా ఏనుగు బలానికి భయపడి నోర్మూసుకొని కూర్చుంది. ఇలా ఆ ఏనుగు చేస్తున్న అరాచక చర్యలు ఆ అడవిలోని అన్ని జంతువులకి ప్రాణా సంకటంగా మారింది.

ఒకరోజు కొన్ని నక్కలు సమావేశం అయి, ఏనుగు చేస్తున్న చర్యలకు తిట్టుకున్నాయి. ఈ ఏనుగు ధాటికి మనం స్వేచ్ఛగా అడవిలో తిరగలేకపోతున్నాం. అని అక్రోసం వెళ్ళకక్కాయి.

అప్పుడు 'జంబులింగం' అనే కుర్ర నక్క లేచి, నక్క సోదరులారా! మీరు అందరూ అంగీకరిస్తే ఆ ఏనుగుని నేను సంహరిస్తాను. అలా చేస్తే ఆ ఏనుగు పీడా మనకి వదులుతుంది. పైగా అంత ఆకారంలో ఉన్న ఆ ఏనుగు శరీరాన్ని మనం రెండు నెలలు హాయిగా భుజించవచ్చు అని ఉత్సాహంగా చెప్పింది.

జంబులింగం మాటలు విని, మిగిలిన నక్కలు ఉలిక్కిపడ్డాయి. అందులో ఒక నక్క ఇలా అన్నది. ఏనుగు ఛస్తే మనకే కాదు, ఈ అడవిలోని అన్ని జంతువులకీ పండుగే కానీ, ఏనుగు కాలు అంత కూడాలేని ఈ కుర్ర నక్క అంత పెద్ద ఏనుగుని ఎలా చంపుతుంది? దానికి జంబులింగం ఇలా అన్నది.

“మీరు అన్నది నిజమే, నేను ఏనుగు కన్నా చాలా, చాలా చిన్న పరిమాణంలో ఉన్నదాన్నే, కానీ నాకు తెలివి చాలా ఉన్నది. యుక్తిగా ఆ ఏనుగుని వంచించి సంహరిస్తాను.

దాంతో అన్ని నక్కలు ఆనందించి, జంబులింగాన్ని ఏనుగుని చంపే పథకం వేయమని కోరాయి. జంబులింగం ఉత్సాహంగా అక్కడి నుండి బయలుదేరి గజేంద్ర వద్దకు వెళ్ళాడు.

జంబులింగం వెళ్ళేసరికి, గజేంద్రుడు ఒక పెద్ద అరటి గెలను భోంచేస్తున్నాడు. నక్క అతి వినయంగా వంగి, గజేంద్రకి నమస్కారం పెట్టి నిల్చుంది.

గజేంద్రుడు అరటి గెల తినటం ఆపి, ఏయ్ నక్కా ఏంటి ఇలా వచ్చావు అంది గంభీరంగా... దానికి జంబులింగం ఓ గజేంద్రా! మీరు చాలా బలవంతులు.

మీకున్నబలం ఈ అడవిలో ఎవరికీ లేదు. అన్నది మహా వినయం ఒలక బోస్తూ, దానికి గజేంద్రుడు పొంగిపోతూ, అయితే ఏమంటావు అన్నాడు గర్వంగా అప్పుడు జంబులింగం ఇలా అన్నది.

“ఓ! గజరాజా, మీరు ఈ అడవికి రాజు అయి పాలించాలని ఈ అడవిలోని జంతువులు కొరుతున్నాయి. నేను ఆ జంతువుల ప్రతినిధిగా వచ్చాను. మీరు దయచేసి, ఈ అడవికి రాజుగా ఉండటానికి అంగీకరించాలి.”

ఏనుగు ఉత్సాహంగా సరే, ఇప్పుడు ఏంచేద్దామంటావు అన్నది. అప్పుడు జంబులింగం ఇలా అన్నది. ఓ గజేంద్ర ఈ రోజు సాయంత్రం మీరు సింహాసనం ఎక్కాలి, ఒక పండితులవారు మంచి ముహూర్తం నిర్ణయించారు. మీకు ఈ రోజు పట్టాభిషేకం చేస్తాం.

దానితో గజేంద్రకి చాలా సంతోషం కలిగి, సరే పద, అన్నది. నక్క ముందు దొవ చూపిస్తుండగా, గజేంద్ర ఠీవిగా నడుస్తూ నక్క వెనకాల నడవసాగింది.

కొంత దూరం అలా అడవిలోకి వెళ్ళిన తర్వాత ఒక బురద నేల ఎదురయింది. నక్క బరువు తక్కువగా ఉండే జంతువు కనుక అలా చలాకీగా ఆ చిత్తడి నేలను దాటి వెళ్ళింది. ఏనుగు చిత్తడి నేల విషయం పట్టించుకోకుండా బలంగా అడుగులు వేస్తూ, చిత్తడి నేలలో కూరుకుపోసాగింది.

నిముషాలలో గజేంద్ర తల తప్పించి, మిగిలిన శరీరం అంతా ఊబిలాగా ఉన్న ఆ చిత్తడి నేలలో కూరుకుపోయింది. నక్క మాత్రం కూలాసాగా, దూరంగా నించుని కూని రాగాలు తీయసాగింది. గజేంద్రకి జీవితంలో తొలిసారి భయం మొదలైంది. అది ప్రాణభయంతో గజ, గజలాడుతూ ఇలా అన్నది.

"ఓ నక్కా! నేను ఈ బురద నేలలోంచి బయటికి రాలేకపోతున్నాను. దయచేసి నన్ను బయటి లాగి కాపాడు. గజేంద్ర మాటలు విని జంబులింగం బిగ్గరగా ఊళ పెట్టి ఇలా అన్నది.

ఓరీ... బుద్ధిలేని బండ ఏనుగా, ముక్కు, మొహం తెలియని అపరిచితుడిని అయిన నన్ను గుడ్డిగా నమ్మి వచ్చావు. నీ ఖర్మ కాలింది. నీవు ఈ బురదలో చావక తప్పదు.

దాంతో గజేంద్రుడు బిక్క చచ్చిపోయింది. ఆ తర్వాత కొన్ని నిముషాలకి ఆ ఏనుగు పూర్తిగా ఆ చిత్తడి నేలలో కూరుకుపోయి మరణించింది. ఏనుగు పీడా వదిలినందుకు ఆ అడవిలోని జంతువులన్నీ ఆనందించాయి.

నీతి : అపరిచితుల్ని నమ్మరాదు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

స్నేహమేరా జీవితం | నీతి కథలు | Moral Stories in Telugu

పూర్వం చంద్రగిరి అడవుల్లో ఒక జింకల కుటుంబం జీవిస్తూఉండేది. ఆ కుటుంబంలో ఉన్న ఒక పిల్ల జింక మహా తుంటరిది. అది అనేక రకాలుగా దాని తల్లి, దండ్రుల్ని ఆడించి, విసిగించేది. ఒక్కొసారి అర్ధరాత్రులు తన మందని వదిలి దూరంగా వెళ్ళి గడ్డి మేసేది.  ఒకసారి ఆ జింక పిల్ల అలాగే మంద నుండి విడిపోయి, దూరంగా తిరగ సాగింది. అలా తిరుగుతూ తిరుగుతూ ఆ జింక పిల్ల ఒక వేటగాడు పన్నిన వలలో చిక్కిపోయింది. ఆ వేటగాడు ఆ జింకను తీసుకెళ్ళి యువరాణికి జన్మదిన కానుకగా ఇచ్చాడు. ఆ అందమైన జింక పిల్లను చూసిన యువరాణి ఆనందంతో ఎన్నో విలువైన ఆభరణాలు, వస్త్రాలు వేటగాడికి బహుమతిగా ఇచ్చింది. అంత విలువైన బహుమానాలు అందుకున్నా వేటగాడు ఆనందంగా తన ఇంటికి తిరిగి వెళ్ళాడు. యువరాణి ఆ జింకను ఎంతో ప్రేమగా చూసుకున్నది. దానికి ఎన్నో రకాల ఆహారాలు పెట్టేది. ఎన్ని చేసినా, ఆ జింకకు ఆనందం కలుగలేదు. కారణం స్వేచ్ఛ జీవిగా ఆనాటి దాకా బ్రతికిన జింక యువరాణి గృహంలో నిర్భంధించ బడింది. అలా దిగులు పడి, ఆ జింక పిల్ల నిద్ర ఆహారాలు మనేసి, దిగులుగా - పడుకునేది. ఇది చూసిన యువ రాణి ఎంతో బాధ పడి జింకకు స్వేచ్ఛ కల్గించాలని నిశ్చయించుకొని, భటుల్ని పిలిచి ఆ జింకను అడవిలో వ...

దుష్టుడికి చేసిన మేలు | నీతి కథలు | Moral Stories in Telugu

పూర్వం 'వేండ్ర' అనే గ్రామంలో పిచ్చయ్య శాస్త్రి అనే పేద బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడికి నలుగురు ఆడ పిల్లలు జన్మించారు. అతని భార్య సుశీల. చాలా ఓర్పు గల స్త్రీ. ఆమె ఎంత పేదరికం అనుభవిస్తున్నా భర్తను, పిల్లల్ని ఆపేక్షగా చూస్తుండేది. అధిక సంతానం పైగా సరిఅయిన సంపాదనా లేని శాస్త్రికి ఆర్థిక సమస్యలు అధికం కాసాగాయి. శాస్త్రి కుటుంబం కనీసం ఒక్క పూటైనా కడుపు నిండా తిండి తినలేని దౌర్భాగ్య స్థితికి చేరింది. పైగా శాస్త్రి కూతుళ్ళలో మొదటి ఇద్దరు ఆడ పిల్లలు పెళ్ళిడుకు వచ్చేసారు. ఇక శాస్త్రి భార్య సుశీల ఈ దరిద్రాన్ని, అసహాయతను సహించలేకపోయింది. దాంతో భర్తను, పిల్లలు దూరంగా దొడ్లో చెట్టకు పాదులు తీస్తున్న సమయంలో కలిసి ఇలా అన్నది. “ఏమండీ చూస్తున్నారు కదా, మన కుటుంబ దుస్థితి. తినటానికి తిండిలేదు. కట్టుకొవటానికి సరైన బట్టలులేవు. పైగా పైవాళ్ళు ఇద్దరూ పెళ్ళికి సిద్ధం అయ్యారు. మీరు వేరే ప్రాంతానికి వెళ్ళి, ఏదైనా ఉద్యోగం చేసి నాలుగు రూపాయలు సంపాదించుకురండి.” భార్య మాటలకు శాస్త్రి 'ఔను' అన్నట్టు తల ఆడించాడు. ఆపై ఏమీ ఆలోచించకుండా భార్య, బిడ్డల్ని గ్రామంలో వదిలేసి సంపాదన కోసం కాస్త దూరంలో ఉన్న పట్టణాన...

అసూయకు ఫలితం | నీతి కథలు | Moral Stories in Telugu

మేడపాడు అనే గ్రామంలో పాపయ్య అనే రజకుడు ఉండేవాడు. అతడు ఊళ్ళోని ప్రజల ఇళ్ళలోని మురికి బట్టలు ఉతికి, సాపు చేసి అందించేవాడు. పాపయ్యకి ఒక గాడిద, ఒక కుక్క ఉండేది. గాడిద ఉదయం పూట మురికి బట్టల మూటలు మోసుకొంటూ పాపయ్య వెంట ఊరి చివరున్న పంట కాలవ దాకా వెళ్ళేది. సాయంత్రం కాగానే ఉతికి, మడతలు పెట్టిన బట్టల మూటలు మోసుకుంటూ ఇంటికి వచ్చేది. అయినా దానికి పాపయ్య తగినంత తిండి పెట్టేవాడు కాదు. పైగా అప్పుడప్పుడూ, బుద్ధిలేని గాడిదా! అని తిడుతూ, బెత్తంతో బాదేవాడు. ఇక కుక్క విషయానికి వస్తే, అది చేసే పనిల్లా ఆ ఇంటికి కాపలా కాయటం. రాత్రళ్ళు ఇంటి చుట్టూ తిరుగుతూ దొంగలు రాకుండా చూడటం. పాపయ్య కుక్కని ఎంతో ప్రేమగా చూసేవాడు. దానికి పాలు పోసేవాడు. ఆదివారం నాడు మాంసం కూరపెట్టేవాడు. కుక్కకి యజమాని ఇస్తున్న ఆహారం, గౌరవం చూసి గాడిదకు ఆగ్రహం కల్గది. ఏమిటీ నా ఖర్మ, చచ్చేచాకిరీ, చేసే నాకేమో సరిగ్గా తిండి పెట్టరు, పైగా తిట్లు, దెబ్బలు, కానీ ఊరికే అలా నిల్చుని ఎవరైనా వస్తే మొరిగే కుక్కకు అంత గౌరవం ఏమిటి అని తెగ విచారించేది. చివరికి గాడిదకి ఒక విషయం స్ఫురించింది. అదేమంటే కుక్కకి అంత గౌరవం ప్రాముఖ్యత రావటానికి కారణం దాని ప్రవర్తన...